జయశంకర్ బడిబాటలో డీఈఓ పిలుపు – ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి ఈ చిత్రం కేవలం ప్రతీకాత్మక ప్రయోజనం కోసం ఉపయోగించబడింది
జయశంకర్ బడిబాటలో డీఈఓ పిలుపు – ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి ఈ చిత్రం కేవలం ప్రతీకాత్మక ప్రయోజనం కోసం ఉపయోగించబడింది
జగిత్యాల, జూన్ 5 | DNN News |:
ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, వారి సేవల ద్వారానే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి రాము అన్నారు.
భీమారం మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఈ నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన, అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు సంస్కారం కూడా నేర్పబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉదయం అల్పాహారం కూడా అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 9 రకాల వస్తువులతో కూడిన విద్యా కిట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 26 కొత్త ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఈ ఏడాది బాసర ట్రిపుల్ ఐటీలో జిల్లాకు చెందిన 126 మంది విద్యార్థులు సీట్లు సాధించడం ప్రభుత్వ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిలో చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తు చేస్తూ, గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వాటి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు బహుముఖ ప్రజ్ఞాశాలులుగా తీర్చిదిద్దబడతారని అన్నారు.
ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులతో పాటు గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతరం పీఆర్టీయూటీఎస్ సంఘం సహకారంతో విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేశారు.
తదుపరి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా జిల్లా విద్యాధికారి మాట్లాడారు. గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మకిలి కావేరి కుమార్, మండల విద్యాధికారి మధుసూదన్ రెడ్డి, పీఆర్టీయూటీఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడు బోయినిపెల్లి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి, ఉపసర్పంచ్ బోయినిపెల్లి రాంమోహన్ రావు, మేడిపల్లి మండల విద్యాధికారి లక్ష్మీనరసయ్య, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం వెంకట్ రమణ, ప్రధానోపాధ్యాయురాలు స్వప్న, సీఆర్పీ బర్ల నారాయణ, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
🖋️ రిపోర్టర్: మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల జిల్లా
📰 DNN NEWS ప్రతినిధి
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Good News for parents and students.