"అగ్రిగోల్డ్ బాధితుల న్యాయపోరాటంలో ఇది ఒక పెద్ద ముందడుగు" అని ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
"అగ్రిగోల్డ్ బాధితుల న్యాయపోరాటంలో ఇది ఒక పెద్ద ముందడుగు" అని ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
గుంటూరు, జూన్ 5 | DNN News |:
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి విజయవాడ కేంద్రంగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
గురువారం గుంటూరులో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 12 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్న లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఇది ఒక కీలక ముందడుగు అని అన్నారు. తాజాగా జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో విజయవాడ కేంద్రంగా 21 మంది సిబ్బందితో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించడం, ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమన్నారు.
గతంలో నిరంతర పోరాటాల ఫలితంగా రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన 10.43 లక్షల మంది బాధితులకు డబ్బులు ఇప్పించగలిగామని, అలాగే ఆత్మహత్యలు, గుండెపోటులు, తీవ్ర మనోవేదనతో మరణించిన 142 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించడంలో అసోసియేషన్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.
మార్చి 2 నుంచి 6 వరకు నిర్వహించిన రిలే దీక్షలు, నిరవధిక ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం పి-4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు వర్ల రామయ్య దీక్షా శిబిరానికి వచ్చి దీక్ష విరమింపజేసిన విషయాన్ని గుర్తుచేశారు.
అగ్రిగోల్డ్ అంశంపై ముగ్గురు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న ముప్పాళ్ల, ప్రత్యేక సీఐడీ బృందం ఏర్పాటు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు వంటి చర్యలు బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా ముందుకు తీసుకెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మొత్తం 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉండగా, వారిలో 19.52 లక్షల మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారేనని తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం పలు కోర్టుల్లో వందలాది కేసులు వేసి పరిష్కార ప్రక్రియను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. యాజమాన్యం తమపై ఉన్న అన్ని లిటిగేషన్లను ఉపసంహరించుకుని, బినామీ ఆస్తుల వివరాలను సీఐడీకి అప్పగించి ప్రభుత్వం, కోర్టులకు సహకరించాలని కోరారు.
అగ్రిగోల్డ్ బాధితులకు త్వరితగతిన డిపాజిట్లు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ నాయుడు, ప్రధాన కార్యదర్శి వి. తిరుపతిరావు, ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖరరావు తదితర నాయకులకు అభినందనలు తెలిపారు.
“అగ్రిగోల్డ్ బాధితుల న్యాయపోరాటంలో ఇది ఒక పెద్ద ముందడుగు“ అని ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
🖋️ రిపోర్టర్: DNN NEWS ప్రతినిధి
📍 గుంటూరు, గుంటూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
